PREVENTION IS BETTER THAN
CURE
మోహన్ దాస్ నీరుకట్టు
కొన్ని
వందల సంవత్సరాల క్రితం వైద్య శాస్త్రానికి అధ్యుడైన చరకుడు చెప్పిన మాట ఇది.
ఇప్పటికీ ఆ సూక్తి లోని సూక్ష్మమును
ఛేదించడంలో చొరవ చూపని నేపధ్యంలో అనేక విపత్తులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు.
లోపించిన ప్రాప్త కాలజ్ఞానం
నేను ఇవాళ
కరోనా గురించి మాట్లాడబోతున్నా. ఈ వ్యాధి ఎలా వచ్చింది, ఏ స్థాయిలో వ్యాపిస్తున్నది, మరణాల స్థాయి ఎంత స్వయకృపరాధ మానవ హననం కరోనా రూపంలో ప్రపంచాన్ని ఎంతగా
గడగడలాడిస్తున్నదనే విషయాలు అప్రస్తుతం. 16 వ శతాబ్దంలో ప్లేగు, 19వ శతాబ్దంలో
మలేరియా,
20వ శతాబ్దపు తొలినాళ్లలో ఎయిడ్స్, కేన్సర్, ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ, డెంగీ, ఎబోలా వంటి వ్యాధులు ప్రజలను
వణికించాయి. నిపా వైరస్ అరుదైన, తీవ్రమైన
ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు, మనుషుల్లో ఎవరి నుంచి ఎవరికైనా ఈ
వైరస్ సోకుతుంది.1998లో మలేషియాలో
మొదటిసారిగా వైరస్కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది. ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు
పక్షవాతంతో మృతి చెందుతున్నారు. మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది
చనిపోతున్నారు.
ఇప్పుడు కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రపంచ
దేశాలు ఈ మధ్య గడగడలాడిపోతున్నాయి. సార్స్, మెర్స్, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా... ఇవన్నీ
దశాబ్దకాలంగా కనీవినీ ఎరుగని కొత్త వైరస్లు. వీటి ద్వారా సంక్రమించే వ్యాధులు
వివిధ దేశాలలో కంటి మీద కునుకు లేకుండా చేసి, తమ తమ మార్గాల్లో మరణమృదంగాన్ని మోగించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)
ఈ వ్యాధులపై గట్టి పోరాటమే చేస్తోంది. ఈ వ్యాధులతో ప్రాణనష్టంతో పాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రయాణాలపై
ఆంక్షలు,
ఎగుమతి దిగుమతులపై నియంత్రణల కారణంగా చాలా దేశాలు
ఆర్థికంగానూ నష్టపోతున్నాయి. ఇప్పుడు చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రబలడంతో ప్రాణాంతక వైరస్లు మరోసారి
చర్చనీయాంశమయ్యాయి. కొన్ని వైరస్లకు చికిత్సలు ఉండటం లేదు.
ఎందుకంటే అది గతం. సమాచార, శాస్త్ర సాంకేతిక వ్యవస్థలు, అభివృద్ధికి నోచుకోని దశలో వ్యాధులను అరికట్టడం ఒకప్పుడు క్లిష్టమైన విషయం.
కానీ ప్రపంచం అన్ని రంగాల్లో ముందడుగు వేసిన దశలో చైనా లాంటి ఒక పెద్ద మానవ, ఆర్ధిక వనరులుగల స్వయంప్రతిపత్తి గల దేశం ఒక్క వ్యాధికి
చిగురుటకులా వణికి పోతోంది. ప్రపంచం మొత్తం భీతావహ దృశ్యంపై చర్చిస్తోంది.
ఆవిష్కరణలు ఊహాజనిత స్థాయిని దాటి, ఎల్లలు సరిహద్దులను దాటుకుని ప్రపంచాన్ని ఒక మూసలోకి చేర్చిన తర్వాత కూడా
ఇటువంటి కష్టం వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి వుండరు. అయితే ప్రపంచ దేశాలు
నిబద్ధతతో వ్యవహరించక, స్వీయ అభివృద్ధి
చిత్ర పటాన్ని అవిష్కరించాలనే దుగ్ధతో వాస్తవ అభివృద్ధి రంగాల పట్ల ఉదాసీనంగా
వ్యవహరించాయి. ఎక్కడికక్కడ ఆర్ధిక, సైనిక శక్తులను కూడగట్టుకొని బలీయమైన శక్తులుగా బలహీన రాజ్య వ్యవస్థలను
ప్రతిక్షేపించే పనిలో పడ్డాయి. అగ్ర రాజ్యాలు తమ ఆర్థిక మూలలను, సైనిక వ్యవస్థలను మిగతా ప్రపంచానికి చాటి వర్ధమాన మూడో
ప్రపంచాన్ని తమ కనుసన్నల్లోకి తెచ్చుకోవాలని, ఒక్క మాటలో చెప్పాలంటే తమ గుప్పిట బంధించాలనే యావతో చేస్తున్న ప్రయత్నాల వల్ల
జనావళి అవసరాలకు తగిన ఆలోచనలతో ముందడుగు వేయలేకపోయాయి. రష్యాలో కమ్యూనిస్టు పాలనా వ్యవస్థ కుప్పకూలిన తర్వాత తదుపరి
కమ్యూనిస్టు దేశం చైనాపై పలు దేశాల కన్నేసాయి.
ఆసియాలోని క్రూడ్ నిలువలు అపారంగా కలిగిన అరబ్ దేశాలను గుప్పిట
పెట్టుకునేందుకు 90వ దశకం నుంచీ పలు
స్వల్పకాలిక కవ్వింపు యుద్ధాలు తెరపైకి వచ్చాయి. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై
ఇరాక్ దాడి కూడా అందులో భాగంగానే చెప్పాల్సివుంటుంది. భారతదేశం స్వతంత్రంగా
వ్యవహరిస్తున్నట్లు పైకి కనిపించినా అమెరికా మాత్రం తన అమ్ములపొదిలో అస్త్రంగానే
ప్రచారంలో పెట్టింది. అమెరికాలో
డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మధ్య అధికార మార్పిడి
చేతులు మారినా వారి విదేశాంగ, ఆర్ధిక విధానాలు
మారవు. ప్రతి చోటా సరళీకృత ఆర్థిక విధానాలను ప్రోత్సహిస్తూనే ఓటు బ్యాంకు రాజకీయ
వ్యవస్థను ప్రోత్సాహకాలు అందించడం చూస్తున్నాం
ఇంత
ఉపోద్ఘాతం ఎందుకంటే సంయమనంతో పాలన సాగించలేని అధికార వాంఛ వల్లే ప్రజలను
సురక్షితంగా ఉంచలేకపోతోంది. "చేతులు కాలాక ఆకులు పెట్టుకున్న" రీతిలో
పాలకులు ఇపుడు సూక్తి ముక్తావళిని జనం ముందుకు తెస్తున్నారు. ఇదొక విచిత్ర
పరిస్థితి. అగమ్యగోచర స్థితిని తెలియకుండా బయట పెట్టడం.
ప్రపంచంలోని
అనేక దేశాల అధినేతలు తమ విదేశీ పర్యటనల్లో, విదేశాంగ విధానాలలో దౌత్య ఒప్పందాలలో
తొలి అంశం శాంతికోసం ద్వైపాక్షిక రక్షణ
ఒప్పందాలు కుదుర్చుకొంటూనే, మరుసటి క్షణమే
ఆయుధాల కొనుగోలుకు సంబంధించి లక్షల కోట్ల
ఎం.ఓ.యుల పై (ఒప్పందాలు) సంతకాలు చేసుకొంటున్నారు. దేశ బడ్జెట్లో పాతిక
భాగం పైనే నిధులను ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేందుకు, మిలటరీని బలోపేతం చేసుకునేంఫు వెచ్చిస్తున్న దృశ్యం కళ్ళకు
కట్టారు నేటి పాలకులు. పరస్పర విశ్వసనీయత కోల్పోయిన నేపధ్యపు పర్యవసానం ఈ స్థితి.
వ్యవసాయం,
విద్య, వైద్యం వంటి
ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి పరస్పర ఒప్పందానికి ఎక్కడో చివరి అవకాశం
దక్కుతుండడం గమనించవచ్చు. విదేశీ పర్యటనలు యావత్తూ పెట్టుబడుల ఆకర్షణ, కొత్త రుణాలను సంపాదించే యావతోనే సాగుతుండటం గమనార్హం.
వైద్య పరిశోధనలు, ప్రజల మౌలిక అవసరాలకు తగ్గట్టుగా ప్రాధాన్యత
నిర్ధేశించుకోలేని స్థితికి చాలా దేశాలు దిగజారాయి. వైద్యం, విద్య రెండూ రెండు
కళ్లుగా ప్రభుత్వ అధీనంలో లేకపోతే ఐసోలేషన్ కేంద్రాలకే ప్రజల జీవితాలు అంకితం
కానున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ముందుచూపు లేని విధానాలు విపత్కర
విపత్తులను ఎదుర్కొనలేవని "కరోనా" నిరూపించింది. దుర్భేద్యమైన ఆర్ధిక వ్యవస్థలు కూకటి వేళ్ళతో
సహా పెకిలించవేయబడతాయని నిర్ధారణ అయింది. ఒక్క వ్యాధి యావత్తు స్టాక్ ఇండెక్స్ ను
నెలచూపులకు నెత్తిన వాస్తవాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మిలియన్, బిలియన్, ట్రలియన్ సంపద, మందుగుండు ఆయుధ సంపత్తి, సైనిక పాఠవం, లక్షల కోట్లు
వెచ్చించి దాచుకున్న వైమానిక యుద్ద సామాగ్రి ఎందుకూ కొరగావడం లేదు. ఇది పచ్చి
నిజం. యుద్ధ వీరులుగా వినుతికెక్కాలని బుస కొట్టే
వారు, శాంతి కాముకులుగా పద్మాసనం వేసుకొని
యోగ నిద్రలోకి ప్రజలను జోకొట్టేనుకొనే వారూ అసలుసిసలు అవసరం ఏమిటో ఇప్పటికైనా
గ్రహించాలి. ఇది చారిత్రక అవసరం. ఇది చారిత్రాత్మక బాధ్యత. సకల రుగ్మతలను
పోగొట్టేది, సకల అరిష్టాలను రూపుమాపేందుకు
సైన్స్ పై విస్తారమైన పరిశోధనలు ప్రేరేపించడం.
ప్రత్యేకించి భారత దేశం నుంచి వేలం వెర్రిగా తరలిపోతున్న శాస్త్రవేత్తలకు
స్వదేశంలో పరిశోధనలు చేసే వీలు, వెసులుబాటు
కల్పించడం. అందుకు అవసరమైన ఒప్ప0దాలు చేసుకోవడం
కింకర్తవ్యం.
ఎన్నో
విపత్తులను ధైర్యంగా ఎదుర్కొన్న మనం కరోనా
బారి నుంచి కూడా బయటపడే రోజు దగ్గర్లోనే
ఉంది. ఎన్నో వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి తగిన
మందును త్వరలోనే ఆవిష్కరించడ0 తధ్యం. కొసమెరుపు ఏమిటంటే కరోనాకు విరుగుడుగా వస్తున్న మందు
కూడా అమెరికా నుంచే పేటెంట్ పొందబోతోంది.
మానవాళి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని
గర్భస్థ దశలోనే పిండాలకు వ్యాధి నిరోధక టీకాలను అందించే సూక్ష్మ పరిజ్ఞానం
మరింతగా అందుబాటులోకి తేవడానికి శాస్త్ర పరిశోధకులు మరింత కృషి కొనసాగిస్తారని
ఆశిద్దాం.* వ్యాధి రహిత ఆరోగ్య భారతావని
ఆవిష్కరణకు నిధులను వినియోగించుకోవాలి. లక్షల కోట్ల బకాయిలు రద్దు చెందుతున్న
పాలకులు వాస్తవ దృక్పథంతో ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. విలాసవంతమైన జీవితాల కంటే నమ్మకమైన నిండూ
నూరేళ్ళ జీవితానికి భద్రత, భరోసా
కల్పించాల్సిన అవసరం ఉంది.