ప్రాథమిక స్థాయిలో పాఠాల కుదింపు
♦బోధన 120 రోజుల్లో పూర్తయ్యేలా పుస్తకాల రూపకల్పన
🌻ఈనాడు, అమరావతి: ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాఠ్యాంశాలను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. విషయాలను విస్తృతంగా కాకుండా ఉన్న పాఠాలనే లోతుగా నేర్చుకునేలా బోధన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. పాఠాలు చెప్పేందుకే విద్యాసంవత్సరమంతా సరిపోతే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సమయం ఉండబోదని పేర్కొంటోంది. ప్రస్తుత పాఠ్యాంశాలు ఎక్కువగా ఉన్నాయన్న విద్యావేత్తల వినతుల నేపథ్యంలో పాఠాల సంఖ్యతోపాటు కొన్ని పాఠాలను కుదించాలని ఎస్సీఈఆర్టీ భావిస్తోంది. వచ్చే ఏడాదినుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నందున 1 నుంచి 5 వరకు ఆంగ్లంలో పుస్తకాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలతోపాటు సీబీఎస్ఈ పాఠ్యాంశాలు, విదేశాల్లోని పాఠ్యపుస్తకాలను నిపుణుల బృందం పరిశీలించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల ప్రమాణాలు పెంచేలా సీబీఎస్ఈ స్థాయిలో పాఠ్యాంశాలు ఉండేలా నమూనాలను రూపొందిస్తోంది. ప్రాథమిక తరగతుల బోధన 120 రోజుల్లో పూర్తి చేసేలా పుస్తకాలు తీసుకురానున్నారు. పాఠశాలల పనిదినాలు 220 రోజులున్నప్పటికీ సెలవులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు ఎస్సీఈఆర్టీ గుర్తించింది. దీంతో 120 రోజుల్లో పాఠ్యాంశాలు పూర్తి చేసి మిగతా సమయంలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, బోధన కొనసాగించేలా ప్రణాళికను రూపొందిస్తోంది. గ్రామసచివాలయ వ్యవస్థ మారినందున స్వపరిపాలన పాఠంలో ఈ మార్పు తేనున్నారు.